India: భారత్ లోనే తొలిసారి.. కులం, మతం లేదని సర్టిఫికెట్ అందుకున్న యువతి!

  • తమిళనాడుకు చెందిన స్నేహ రికార్డు
  • సర్టిఫికెట్ జారీచేసిన అధికారులు
  • హర్షం వ్యక్తం చేసిన స్నేహ

కులం, మతం కంటే మానవత్వం గొప్పదని చెబుతారు. దీన్ని ఆచరణలో పెట్టిన ఓ యువతి తాను ఏ కులం, మతానికి చెందిన వ్యక్తిని కాదని సర్టిఫికెట్ పొందింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పతూర్ లో చోటుచేసుకుంది.

తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీంతో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో  కులం, మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు. ఈ క్రమంలోనే తనకు కులం, మతం లేదనీ, భారతీయురాలిగా సర్టిఫికెట్ జారీచేయాల్సిందిగా కోరారు. అయితే రకరకాల సాకులు చెబుతూ ఇందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు.

చివరికి ఈ విషయం తెలుసుకున్న తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ వెరిఫికేషన్ చేయించారు.ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమని తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు.

దీంతో ఈ నెల 5న స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం మతం లేదని సర్టిఫికెట్ జారీచేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు. స్నేహ భర్త పార్తీబ రాజా మాట్లాడుతూ.. తమ ముగ్గురు కుమార్తెల స్కూల్ దరఖాస్తుల్లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్ ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు చెబుతున్నారు.

More Telugu News