Mahesh Babu: టీడీపీ తరపున మహేశ్ బాబు పోటీ చేస్తాడనే వార్తలపై నమ్రత స్పందన

  • చంద్రబాబు అంటే మహేశ్ కు చాలా గౌరవం ఉంది
  • రాజకీయపరమైన లక్ష్యాలు మహేశ్ కు లేవు
  • తన సమయమంతా సినిమాలకే సరిపోతోంది

రానున్న ఎన్నికల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు టీడీపీ తరపున ప్రచారం చేయడమే కాకుండా, పోటీ కూడా చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన భార్య నమ్రత శిరోద్కర్ స్పందించారు. 'రాష్ట్రానికి ఎంతో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నా భర్తకు చాలా గౌరవం ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ఉండటాన్ని చూసి ఆయన చాలా గర్విస్తుంటారు. చంద్రబాబు పక్కన మహేశ్ కనిపించినంత మాత్రాన... ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదు' అని నమ్రత తెలిపారు.  

టీడీపీ తరపున మహేశ్ ప్రచారం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా... అలాంటిదేమీ ఉండదని నమ్రత స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి మహేశ్ ప్రచారం చేయబోరని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికగానీ, రాజకీయపరమైన లక్ష్యాలు కానీ మహేశ్ కు లేవని తెలిపారు. ఆయన సమయమంతా సినిమాలకే సరిపోతోందని... కుటుంబంతో గడిపే సమయమే ఆయనకు ఫ్రీ టైమ్ అని చెప్పారు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా మహేశ్ బయటకు వెళ్లరని తెలిపారు.

జీఎస్టీ చెల్లించనందుకు మహేశ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్పందిస్తూ... 'అన్ని ట్యాక్సులు చెల్లించినా, నిజం నీ వైపే ఉందనే విషయం నీకు తెలిసినా... పన్నులు చెల్లించలేదని టార్గెట్ చేస్తున్నప్పుడు నీవేం చేస్తావు? నవ్వుతూ వేధింపులను భరిస్తావు' అన్నారు నమ్రత.

More Telugu News