Andhra Pradesh: ‘యాత్ర’ సినిమా చూసిన వైఎస్ విజయమ్మ.. దర్శకుడు మహి, చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం!

  • గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంది
  • ప్రజల కోసం వైఎస్ తపనను అద్భుతంగా చూపారు
  • సినిమా చూసిన ప్రజలకు ధన్యవాదాలు

ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరెక్కించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ భార్య, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ యాత్ర సినిమాను ఈరోజు చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి.వి.రాఘవ్, చిత్ర యూనిట్ ను అభినందించారు.

వైఎస్ కొన్నికోట్ల మంది హృదయాల్లో ఉన్నారని విజయమ్మ ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి వారందరి హృదయాలను మరోసారి తట్టిలేపేలా ఈ సినిమా ఉందని అన్నారు. వైఎస్ పేద ప్రజల కోసం పడ్డ ఆరాటం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అద్భుతంగా చూపారని కితాబిచ్చారు. రాజశేఖరరెడ్డిని ప్రజలు 40 సంవత్సరాలుగా నాయకుడిగా ఆదరించి కాపాడుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా యాత్ర సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News