Telangana: కడుపులో కత్తెర ఎపిసోడ్.. మళ్లీ మహేశ్వరికి ఆపరేషన్ చేసిన నిమ్స్ వైద్యులు!

  • ఈ ఘటన దురదృష్టకరమన్న డైరెక్టర్ మనోహర్
  • విచారణ కమిటీని నియమించామని వ్యాఖ్య
  • గతేడాది నవంబర్ 2న ఆపరేషన్ జరిగిందని వెల్లడి

మహేశ్వరి చౌదరి అనే మహిళకు ఆపరేషన్ చేసిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు కడుపులోనే కత్తెరను మర్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియాలో రావడంతోపాటు బాధిత కుటుంబం ఆందోళనకు దిగడంతో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించారు. ఈ ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గతేడాది నవంబర్ 2న మహేశ్వరికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించారని ఆయన తెలిపారు.

మళ్లీ కడుపునొప్పి రావడంతో ఆమె ఆసుపత్రికి వచ్చారనీ, స్కానింగ్ లో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడిందన్నారు. వైద్యులు వీరప్ప, వేణు, వర్మ ఈ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామనీ, నివేదిక అందాక వైద్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు బాధితురాలికి ఈరోజు నిమ్స్ డాక్టర్లు మరోసారి ఆపరేషన్ చేసి, పొట్టలోని కత్తెరను తొలగించారు. ప్రస్తుతం మహేశ్వరి చౌదరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. 

More Telugu News