Thota chandra sekhar: దూకుడు పెంచుతున్న పవన్.. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌కు కీలక పదవి

  • వివిధ కమిటీల నియామకంలో పవన్ బిజీ
  • సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేనన్న చంద్రశేఖర్
  • పవన్ ముఖంలో అలసటే కనిపించదని ప్రశంసలు

సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పార్టీలోని వివిధ పదవులను భర్తీ చేస్తూ జోరుమీదున్నారు. ఇప్పటికే వివిధ పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేసిన పవన్ తాజాగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనతో తనకు పదేళ్ల సాన్నిహిత్యం ఉందన్న పవన్ సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 1987లో సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పటి కంటే ఇప్పుడే చాలా ఆనందంగా ఉందని అన్నారు. పవన్ రోజూ రాత్రి రెండుమూడు గంటల వరకు పనిచేస్తుంటారని, అయినా ఆయన ముఖంలో ఎటువంటి అలసట కనిపించడం లేదని, తాము మాత్రం ఊరికనే అలసిపోతున్నామని అన్నారు. కాగా, సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్‌ను పవన్ రాజకీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. జ‌న‌సేన 'ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రాం' చైర్మన్‌గా రాధా మాధవ్‌ నియమితులయ్యారు.

More Telugu News