Crime News: కోర్టు ప్రాంగణంలోనే వైద్యుడిపై యాసిడ్‌ పోసిన మహిళ

  • తనను మోసం చేశాడంటూ ఆగ్రహం
  • స్వల్ప గాయాలతో తప్పించుకున్న డాక్టర్‌
  • నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షాత్తు కోర్టు ప్రాంగణంలో వందలాది మంది కక్షిదారులు, న్యాయవాదులు చూస్తుండగానే ఓ వైద్యునిపై ఓ మహిళ యాసిడ్‌తో దాడిచేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి.

ఆదర్శ్‌రెడ్డి అనే వైద్యుడు విడాకుల కేసు ఎదుర్కొంటున్నాడు. ఇతని క్లినిక్‌లో ఓ మహిళ నర్సుగా పనిచేస్తోందని సమాచారం. ఆదర్శ్‌రెడ్డి తన కేసు విచారణ జరుగుతుండడంతో గురువారం ఉదయం తిరుపతిలోని కోర్టు ప్రాంగణానికి వచ్చాడు. ఈ సందర్భంలో సదరు మహిళ అతనిపై యాసిడ్‌ పోసి దాడిచేసింది. అయితే ఈ దాడి నుంచి ఆదర్శ్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

వందలాది మంది ముందు జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమయ్యింది. అప్రమత్తమైన పశ్చిమ పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వైద్యుడు తనను మోసం చేశాడని, అందుకే ఈ దాడికి పాల్పడ్డానని నిందితురాలు చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News