Krishna District: మైలవరంలో నగదు కవర్ల ఘటన.. ఇదంతా పచ్చి అబద్ధం: వైసీపీ నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్

  • నగదు కవర్లతో మా అనుచరులు వెళ్లడం అబద్ధం
  • సీసీటీవీ ఫుటేజ్ లు బయటపెట్టండి
  • దేవినేని ఉమకు మైలవరం సీఐ సొంత మనిషి

కృష్ణా జిల్లాలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల అధికారులకు వైసీపీ నేత కృష్ణ ప్రసాద్ అనుచరుడు మాగంటి వెంకట రామారావు నగదు కవర్లు ఇవ్వజూపారన్న ఆరోపణలు తలెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. పోలీసు అధికారులకు నగదు కవర్లు ఇచ్చేందుకు తమ అనుచరులు వెళితే వెంటనే అరెస్టు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఇందుకు సంబంధించి సీసీటీవీల్లో ఫుటేజ్ లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని, సదరు వ్యక్తి చేతిలో నగదు కవర్లు ఉన్నట్టు, పోలీసులకు ఇచ్చినట్టుగా చూపించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు మైలవరం సీఐ సొంత మనిషి అని, తమను వేధించడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులకు నగదు కవర్లు ఇచ్చే ప్రయత్నాలు చేశారన్నది ఓ డ్రామా అని, ఓ ఛానెల్ ఇందుకు సంబంధించిన అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

More Telugu News