Priyaanka Gandhi: విదేశాల నుంచి వచ్చీరాగానే... సోదరుడితో సమావేశమైన ప్రియాంకా గాంధీ!

  • సోమవారం నాడు న్యూఢిల్లీకి వచ్చిన ప్రియాంక
  • ఆ వెంటనే తుగ్లక్ రోడ్ లోని రాహుల్ నివాసానికి
  • ఇద్దరి మధ్యా చర్చలు, పాల్గొన్న జ్యోతిరాదిత్య

గత నెలలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ, విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే, తన సోదరుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన ఆమె, ఆ వెంటనే నేరుగా తుగ్లక్ రోడ్డులో ఉన్న రాహుల్ నివాసానికి వెళ్లారు. ఆపై వీరిద్దరి మధ్యా ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే సమావేశంలో పశ్చిమ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జ్యోతిరాదిత్య సింథియా కూడా పాల్గొన్నారు.

కాగా, గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల కీలక సమావేశం జరుగనుండగా, ఈ సమావేశానికి కూడా ప్రియాంకా గాంధీ హాజరవుతారని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో, ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఎన్నికలకు సిద్ధమయ్యే విషయమై, విపక్ష పార్టీలతో తరచూ చర్చిస్తున్న రాహుల్, గత నెలలో స్వయంగా ప్రియాంక రాజకీయ అరంగేట్రంపై ప్రకటన వెలువరించిన సంగతి విదితమే.

More Telugu News