Chandrababu: చంద్రబాబు, జగన్‌లను ప్రజలు నమ్మరు.. తెలంగాణలోనూ పోటీ చేస్తా: కేఏ పాల్

  • చంద్రబాబు బినామీ పేర్లతో దోచుకున్నారు
  • జగన్ అక్రమంగా సంపాదించి జైలుకెళ్లారు
  • పవన్, జగన్ అంటే ఎవరికైనా తెలుసా?

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి చంద్రబాబు, జగన్‌లపై విరుచుకుపడ్డారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

చంద్రబాబునాయుడు బినామీ పేర్లతో ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. జగన్ లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించి రెండేళ్లు జైల్లో ఉన్నారని అన్నారు. అవినీతిలో మునిగిపోయిన ఈ ఇద్దరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజానికి జగన్, పవన్ కల్యాణ్ అంటే ఎవరికీ తెలియదని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి చాలాసార్లు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని పాల్ పేర్కొన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకూ పోటీ చేస్తామని, అవసరమైతే పొత్తులు కూడా పెట్టుకుంటామని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు ముఖ్యమేనని, రెండూ తనకు రెండు కళ్లు లాంటివని పేర్కొన్న పాల్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ధీమా వ్యక్తం చేశారు.  

More Telugu News