Hyderabad: చెవి దుద్దుల కోసం మూసీ ఒడ్డున ఇద్దరు యువతుల హత్య... పట్టించిన సీసీ కెమెరాలు!

  • బంగారు దుద్దులపై ఆశపడ్డ దుర్మార్గుడు
  • అమ్మవారి ఆవాహనం నేర్పిస్తానని చెప్పి హత్యలు
  • పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు

చెవులకు ధరించిన బంగారు దుద్దులపై ఆశపడ్డ ఓ దుర్మార్గుడు, ఇద్దరిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. మీర్‌ పేట ప్రాంతానికి చెందిన యాదమ్మ, సుమిత్రల మృతదేహాలు అత్తాపూర్‌ సమీపంలోని మూసీ నది వద్ద లభించగా, ఈ కేసును ఛేదించిన పోలీసులు, అంకూరి గిరి అలియాస్‌ శివసత్తు గిరి అనే వ్యక్తి నిందితుడని తేల్చారు. ఈ కేసులో సీసీటీవీ కెమెరాలు ఆధారాలను అందించాయి.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, మూసీ ఒడ్డున కూరగాయలు పండించే సుందరసింగ్‌ అనే వ్యక్తి, తనకు రెండు మృతదేహాలు కనిపించాయని ఫిర్యాదు చేయడంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, నిన్న ఉదయం కంచన్‌ బాగ్‌ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, అతను నేరం ఒప్పుకున్నాడు. కేవలం రెండు గ్రాముల బంగారం కోసం అతను రెండు హత్యలు చేశాడని పోలీసులు వెల్లడించారు.

తనకు కావాల్సిన కల్లు కోసం అతను ఈ పని చేశాడని, జీహెచ్‌ంఎసీ కాంట్రాక్టు ఉద్యోగిగా, స్వీపర్‌ గా పనిచేస్తున్న అతను, తొమ్మిదేళ్ల క్రితం శివసత్తుగా మారాడని, పర్వదినాల సమయంలో కల్లు తాగుతూ ఉండే అతను నేరాలు చేస్తుంటాడని తెలిపారు. ఈ నెల 21న యాదమ్మ, సుమిత్రలు కల్లు కాంపౌండ్‌ కు రాగా, వారి చెవి దుద్దులను చూసి, పథకం ప్రకారం వారితో మాటలు కలిపాడని చెప్పారు. అమ్మవారి పూనకం సాధన నేర్పిస్తానంటూ నమ్మబలికి, మూసీ ఒడ్డుకు తీసుకు వెళ్లి, వారితో పూటుగా కల్లు తాగించి, ఆపై హత్య చేసి, దుద్దులు, మొబైల్ ఫోన్ లను దొంగిలించాడని తెలిపారు. బాధితుల సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాల సాయంతో కేసును పరిష్కరించామని పేర్కొన్నారు.

More Telugu News