Chandrababu: 2017లో నిర్మాణం ప్రారంభించి అప్పుడే ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది.. భేష్: కియాపై చంద్రబాబు ప్రశంసలు

  • తక్కువ సమయంలోనే కియా మోటార్స్ ప్లాంట్ ను చేపట్టాం
  • కియాకు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుంది
  • కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసడర్ గా మారారు

అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్ నుంచి తొలి కారు నేడు విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కారును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే కియా మోటార్స్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. 2017లో నిర్మాణాన్ని ప్రారంభించిన కియా... అప్పుడే ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. దక్షిణ కొరియాకు, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురాగలుగుతారని తెలిపారు.

అనంతపురం ప్రాంతం ఆటోమొబైల్ హబ్ గా మారుతుందనే ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసడర్ గా మారారని కితాబిచ్చారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు తాము ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. కియా మోటార్స్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుందని తెలిపారు. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సూచించారు. ఏపీలో అపోలో టైర్స్, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్డ్ లాంటి భారీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.

More Telugu News