Anantkumar Hegde: హిందూ మహిళపై చెయ్యి వేస్తే నరికేస్తానన్న కేంద్ర మంత్రి... ఫొటో పోస్టు చేసి 'ఏం చేస్తావో చేసుకో' అన్న తెహసీన్‌ పూనావాలా!

  • అనంత్‌ కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలపై దుమారం
  • కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావును టార్గెట్ చేసుకున్న హెగ్డే
  • హెగ్డే వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

"హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలి" అని కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఆయన వ్యాఖ్యల తరువాత, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత తెహసీన్‌ పూనావాలా, తన భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, "హిందూ మహిళపై చేయి వేసాను. ఏం చేస్తావో చేసుకో" అని వ్యాఖ్యానించారు. తెహసీన్ పూనావాలా ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన తన భార్యతో దిగిన చిత్రాన్ని పోస్టు చేస్తూ, హెగ్డే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

ఇదిలావుండగా, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు, ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా గుండూరావును హెగ్డే అభివర్ణించడం కూడా దుమారాన్ని రేపుతోంది. దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్‌ స్పందిస్తూ, తాను రాజకీయాల్లోలేని సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొన్న హెగ్డే, రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని ఆపివేయాలని అన్నారు.

More Telugu News