janasena: నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పలువురు నేతలు

  • జనసేనలోకి ఊపందుకుంటున్న చేరికలు
  • జనసేనలో చేరిన గుంటూరు, నూజివీడు, అగిరిపల్లిలకు చెందిన నేతలు
  • ప్రజాసేవ చేసేవారికి జనసేన మంచి వేదిక అన్న మనోహర్

జనసేనలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల చేరికలు ఊపందుకుంటున్నాయి. పార్టీలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈరోజు గుంటూరు, నూజివీడు, అగిరిపల్లిలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. గుంటూరుకు చెందిన మన్నవ సొదాకర్ (వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు), విజయవాడకు చెందిన సిరిపురపు ఫ్రాన్సిస్, అగిరిపల్లికి చెందిన పీసీసీ కార్యదర్శి పాతూరి రవి, బండి పవన్ కుమార్, దేవిశెట్టి సత్యనారాయణ తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మనోహర్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ప్రజల కోసం పని చేసేవారికి జనసేన మంచి వేదిక అని చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. మార్పు కోసం జనసేన పోరాడుతుందని, జనసేనతోనే సామాజిక మార్పు సాధ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజల నుంచి జనసేనకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

More Telugu News