Telangana: పోలింగ్ కేంద్రంలో ఓటును ఫొటో తీసిన యువకుడు.. సోషల్ మీడియాలో పెట్టడంతో పట్టుకున్న అధికారులు!

  • తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘటన
  • ఎన్నికల్లో ఓటు వేసిన యువకుడు సాగర్
  • ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ యువకుడికి అధికారులు షాకిచ్చారు. తాను వేసిన ఓటును ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మెట్ పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన సాగర్ అనే యువకుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

అయితే ఓటు వేసే సమయంలో రహస్యంగా దాన్ని స్మార్ట్ ఫోన్ తో ఫొటో తీశాడు. అయితే ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉబలాటం అతడిని నిలువనీయలేదు. దీంతో తాను ఓటు వేస్తుండగా దిగిన ఫొటోను సాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దీంతో నిందితుడు సాగర్ పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News