Ganesh kolhatkar: టాయిలెట్ పైపుల్లో ఇరుక్కుపోయిన శరీర భాగాలు.. వెలుగులోకి వచ్చిన హత్య!

  • గణేశ్, శర్మ ఇద్దరూ స్నేహితులు
  • రావల్సిన డబ్బు విషయమై గణేశ్‌‌తో ఘర్షణ
  • నెట్టడంతో కిందపడి గణేశ్ మృతి
  • బ్లాక్ అయిన పైపులు

మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపి ముక్కలుగా కట్ చేసి టాయ్‌లెట్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో తను సేఫ్ అనుకున్నాడు కానీ, కథ అడ్డం తిరిగడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. డీఎస్పీ జయంత్ బజ్‌బల్ కథనం ప్రకారం... గణేశ్ కొల్హత్కర్(53), పింటూ కిషన్ శర్మ(40) ఇద్దరూ స్నేహితులు. ముంబైలోని మిరా రోడ్డులో గణేశ్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తుండగా.. శర్మ షేర్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 15న గణేశ్‌ను తన ఫ్లాట్‌కు పిలిచిన శర్మ.. గతంలో తనకు రావల్సిన డబ్బు విషయమై నిలదీశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

గణేశ్‌ను శర్మ నెట్టడంతో అతడు కిందపడి చనిపోయాడు. దీంతో భయపడిపోయిన శర్మ.. గణేశ్ మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టాయ్‌లెట్‌లో వేసి ఫ్లష్ నొక్కాడు. అయితే శరీర భాగాలు కొన్ని టాయ్‌లెట్ పైపుల్లోనే ఇరుక్కుపోవడంతో అవన్నీ బ్లాక్ అయ్యాయి. ఫ్లాట్స్‌లోని వారు అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేయడంతో అతను పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి శుభ్రం చేయించాడు.

ఈ శుభ్రం చేసే క్రమంలోనే శరీర భాగాలు బయటపడటం.. కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. విచారణలో భాగంగా పోలీసులు అపార్ట్‌మెంట్ వాసులను విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో శర్మను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.  

More Telugu News