Telugudesam: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలేది లేదు.. బుద్ధిచెబుతాం!: టీజీ వెంకటేశ్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్

  • కిడారి, సివేరిల చావుకు చంద్రబాబే కారణం
  • కర్నూలులో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు 
  • పెద్దమనిషి అనే ఇంకా గౌరవం ఇస్తున్నాను

ఆంధ్రప్రదేశ్ లో జనసేన-టీడీపీ కలిసేందుకు అవకాశాలు ఉన్నాయన్న టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోమని, బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాము వద్దనుకుంటేనే టీజీ వెంకటేశ్ కు చంద్రబాబు రాజ్యసభ సీటును ఇచ్చారని చెప్పారు. ‘నా నోరు అదుపుతప్పితే మీరు ఏమవుతారో కూడా నాకు తెలియదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. టీజీ వెంకటేశ్ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిగా మాట్లాడాలనీ, లేదంటే తాను నోరు అదుపుతప్పి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలులో పర్యావరణాన్ని అడ్డగోలుగా కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దమనిషి అనే మర్యాద ఇస్తున్నానని అన్నారు.

ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో తాను మద్దతు ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకోసం టీడీపీ నుంచి తాము ఏదీ ఆశించలేదని గుర్తుచేశారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ, ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని విమర్శించారు.

More Telugu News