Mancherial District: మంచిర్యాలలో దారుణం.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కులం నుంచి వెలి!

  • వార్డు సభ్యుడిగా యువకుడి పోటీ
  • నామినేషన్ వెనక్కి తీసుకోమన్న కుల పెద్దలు
  • వినకపోవడంతో కులం నుంచి బహిష్కరణ

పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న యువకుడిపై కులపెద్దలు బహిష్కరణ వేటు వేశారు. వద్దన్నా వినకుండా పోటీలో దిగుతున్నందుకు అతడి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిందీ దారుణం. జిల్లాలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పి.మహేందర్ నేడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలోని ఆరో వార్డు సభ్యుడిగా బరిలోకి దిగాడు.

అతడు నామినేషన్ వేసిన తర్వాత ఏం జరిగిందో కానీ కులపెద్దలు అతడిని పిలిపించి మందలించారు. నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. అయినప్పటికీ మహేందర్ వెనక్కి తగ్గకపోవడంతో కుల పెద్దలు సమావేశమయ్యారు. మహేందర్ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్టు తీర్పు చెప్పారు. కులం నుంచి అతడిని బహిష్కరించామని, అతడితో ఎవరైనా మాట్లాడినా, లేదంటే అతడు ఎవరితోనైనా మాట్లాడినా జరిమానా విధిస్తామని తీర్పు చెప్పారు.

More Telugu News