క్రికెట్ బెట్టింగ్ ఎఫెక్ట్.. పుట్టింటి నుంచి నగదు తేవాలంటూ భార్యను బయటకు గెంటేసిన భర్త!
- తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఘటన
- క్రికెట్ బెట్టింగ్ లో ఆస్తులు పోగొట్టిన వ్యక్తి
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
సికింద్రాబాద్ లోని బోయినపల్లిలో నరేశ్, శ్వేత దంపతులు ఉంటున్నారు. వీరి వివాహ సమయంలో కుటుంబ సభ్యులు రూ.10 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారాన్ని కట్నం కింద సమర్పించుకున్నారు. అయితే బెట్టింగ్ రుచి మరిగిన నరేశ్ ఆస్తి మొత్తాన్ని హారతి కర్పూరంలా ఖర్చు చేసేశాడు. చివరికి భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలను కూడా వదలలేదు.
అంతా ఖర్చయిపోవడంతో మరింత నగదు తీసుకురావాలని భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు మహిళా సంఘాల సాయంతో అత్తింటి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త నరేశ్, మామ వెంకటేశ్ లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.