Kiran Bedi: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కిరణ్ బేడీ?

  • ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ
  • బేడీపై సీఎం నారాయణ స్వామి ఫైర్
  • చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్లాన్?

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ పదవీకాలం ఎప్పుడో ముగిసినప్పటికీ కేంద్రం ఇంకా ఆయననే కొనసాగిస్తూ వస్తోంది. అయితే, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చెక్ పెట్టేందుకు ద్వివేదీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించగా, ఇప్పుడు కిరణ్ బేడీని ఏపీ గవర్నర్‌గా పంపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, కిరణ్ బేడీకి మధ్య సయోధ్య సరిగ్గా లేదు. దీంతో ఆమెను తొలగించాలంటూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏపీకి పంపాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, కిరణ్‌బేడీ ఏపీ గవర్నర్‌గా రాబోతున్నట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరింత జోరందుకున్నాయి.

More Telugu News