Andhra Pradesh: పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడంటూ.. ఆటో డ్రైవర్ ను చితకబాదిన గ్రామస్తులు!

  • తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో ఘటన
  • సరదాగా ఆటో ఎక్కిన చిన్నారులు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ఇటీవల చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు వచ్చాయని పుకార్లు రేగడంతో దేశవ్యాప్తంగా చాలామందిని స్థానిక ప్రజలు చావగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ వేళ అనిరుధ్, నాగప్రవీణ అనే చిన్నారులు జిల్లాలోని గోకవరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఊరి నుంచి వెళుతున్న ఓ ఆటోలో ఈ చిన్నారులు ఎక్కారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పిల్లల కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆటోను ఒక్కసారిగా చుట్టుముట్టారు. ‘నేను కిడ్నాపర్ ను కాదు మొర్రో’ అని మొత్తుకుంటున్నా వినకుండా డ్రైవర్ ను చావగొట్టారు. అనంతరం తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా పిల్లలు సరదా పడితేనే తాను ఆటోలో ఎక్కించుకున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News