Telangana: నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలే కుట్ర చేశారు.. చస్తే సోనియాగాంధీ కాళ్ల దగ్గరే చస్తా!: సర్వే సత్యనారాయణ

  • దళితుడినైనా జనరల్ స్థానంలో గెలిచా
  • నన్ను హైకమాండ్ మాత్రమే సస్పెండ్ చేయగలదు
  • మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత

తాను దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందానని కాంగ్రెస్ పార్టీ నేత సర్వే సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే అధికారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలకు ఉందా? అని ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్ఠానమే తీసుకోవాలని స్పష్టం చేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బుద్ధి, జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న తనను సస్పెండ్ చేయడంపై సర్వే మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నవారే గాంధీభవన్ లో సమీక్షలు చేస్తున్నారని సర్వే సత్యనారాయణ దుయ్యబట్టారు. దీన్ని ప్రశ్నించినందుకే తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ పంపిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. భట్టి విక్రమార్కతో పాటు తనను ఎన్నికల్లో ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్ర చేశారని ఆరోపించారు. తాను చస్తే కనుక యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కాళ్ల దగ్గరే చస్తానని వ్యాఖ్యానించారు.

More Telugu News