ram: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ

  • రాముడున్నాడని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవని గతంలో యూపీఏ అఫిడవిట్ దాఖలు చేసింది
  • రామ మందిరం అంశానికి ప్రాధాన్యత లేదని రాహుల్ చెప్పారు
  • అమేథీలో కీలక వ్యాఖ్యలు చేసిన స్మృతి ఇరానీ

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాముడే లేడని, అయోధ్యకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆమె విమర్శించారు. అయోధ్య రామ మందిరం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున... దానిపై తాను ఏమీ మాట్లాడబోనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే స్మృతి ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

అమేథీలో స్మృతి మాట్లాడుతూ, 'రామ మందిరం అంశం తనకు అంత ప్రాధాన్యత కలిగిన విషయం కాదని రాహుల్ అన్నారు. రాముడు ఉన్నాడని నిరూపించడానికి చారిత్రక ఆధారాలు లేవని, రామ మందిరానికి కూడా ఎలాంటి ప్రాముఖ్యత లేదని గతంలో సుప్రీంకోర్టులో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాముడు లేడు' అని వ్యాఖ్యానించారు.

నిన్న రాహుల్ మాట్లాడుతూ... రైతు సమస్యలపై పోరాటం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాఫెల్ డీల్ లో అవినీతిపైనే 2019 లోక్ సభ ఎన్నికలు ఉంటాయని... రామ మందిరం సమస్య ఆధారంగా ఎన్నికలు జరగబోవని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా నేడు స్మృతి ఇరానీ పైవిధంగా స్పందించారు. 

More Telugu News