jc diwakar reddy: జేసీకి సవాల్ చేసిన సీఐ మాధవ్ రాజీనామా.. త్వరలో వైసీపీలోకి?

  • జేసీకి మీసం తిప్పి సవాలు విసిరిన మాధవ్
  • వచ్చే ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ
  • వైసీపీ నుంచి హామీ వచ్చాకే రాజీనామా

అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ త్వరలో వైసీపీలో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారమే తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్టు సమాచారం. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదం కారణంగా మాధవ్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. మీసం తిప్పి మరీ జేసీకి ఆయన సవాల్ విసరడం ఇటీవల సంచలనం అయింది. ప్రబోధానంద ఆశ్రమం విషయంలో ఇరువురి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి.

రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్ పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా ఉన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.   

More Telugu News