Narendra Modi: నరేంద్ర మోదీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు?: సీఎం చంద్రబాబు ఫైర్

  • ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు
  • బతికామో, చచ్చామో చూసేందుకా మోదీ వస్తోంది?
  • కష్టాల్లో ఉంటే చూసి వెక్కిరించడానికి వస్తున్నారా?

ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని మోదీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని ప్రశ్నించారు. అనంతపురంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, మనం బతికామో, చచ్చామో చూసేందుకా మోదీ వస్తోంది? మనం కష్టాల్లో ఉంటే చూసి వెక్కిరించడానికి వస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మోదీ రాకను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. మనపై పెత్తనం చలాయించాలని చూస్తున్న మోదీకి ప్రజలు తగినబుద్ధి చెప్పాలని సూచించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మోదీ తప్పారని, నాలుగేళ్ల తర్వాత కూడా ఏపీకి మోదీ న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతుంటే మన వాళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని, నాడు అమరావతికి వచ్చిన మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి తన చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. 

More Telugu News