Uttar Pradesh: ఇల్లు తన పేర రాయాలని కోరిన మాజీ భార్య.. కొండపై నుంచి తోసి చంపేసిన డాక్టర్!

  • ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఘటన
  • భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్న డాక్టర్
  • కేసు నమోదుచేసిన పోలీసులు

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం, బంగారం లాంటి భార్య ఉన్నప్పటికీ ఆ డాక్టర్ పక్కదారి పట్టాడు. భార్య బతికి ఉండగానే మరో యువతిని పెళ్లాడాడు. ఆమె కోసం ఓ ఇంటిని కూడా కొన్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య నిలదీయడంతో సదరు యువతి అతనికి దూరమైంది. అయితే ఆస్తి విషయంలో గొడవ రావడంతో రాక్షసుడిగా మారిన సదరు డాక్టర్ యువతిని హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన డాక్టర్ ధర్మేంద్రప్రతాప్ సింగ్ స్థానికంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఉషా సింగ్ అనే భార్య ఉంది. అయితే 2006లో తన తండ్రికి చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వచ్చిన మరో యువతి రాఖీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె కోసం ఓ ఇల్లును కూడా సింగ్ కొన్నాడు. అయితే ఈ పెళ్లి విషయం తెలుసుకున్న ఉష భర్తను నిలదీసింది. ఈ సంబంధాన్ని మానుకోవాలని హెచ్చరించింది.

ఈ వివాదంతో సింగ్ నుంచి దూరమైన రాఖీ.. మనీశ్ అనే మరో యువకుడిని పెళ్లాడింది. అయితే గతంలో కొన్న ఇంటిని తన పేరుపై బదిలీ చేయాలని రాఖీ.. సింగ్ పై ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అంగీకరించని సింగ్.. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు. అనంతరం మోద్ కుమార్, దేశ్ దీపక్ అనే అనుచరుల సాయంతో ఆమెను కొండపై నుంచి కిందకు తోసేసి హత్యచేశాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ ను తీసుకుని రోజూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేసేవాడు.

ఇలా ఏడు నెలల పాటు ఫేస్ బుక్ ను అప్ డేట్ చేస్తూనే ఉన్నాడు. రాఖీ మిస్సింగ్ పై తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు తొలుత మనీశ్ ను విచారించారు. తాను విధుల్లో భాగంగా నేపాల్ లో ఉన్నాననీ, రాఖీ గల్లంతు కావడంపై తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. దీంతో కాల్ డేటా ఆధారంగా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

More Telugu News