Andhra Pradesh: కుమారుడిని మర్చిపోలేక గుడి కట్టిన తల్లిదండ్రులు!

  • ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఘటన
  • అనారోగ్యంతో చనిపోయిన బాలుడు
  • గుడి కట్టి పూజిస్తున్న తల్లిదండ్రులు

తల్లిదండ్రుల ప్రేమ అనంతమైనది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు చనిపోవడంతో షాక్ కు లోనైన ఓ జంట పిల్లాడికి గుర్తుగా ఏకంగా గుడిని కట్టింది. అంతేకాదు... అక్కడ అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో చోటుచేసుకుంది.

రాజమండ్రికి చెందిన కందిమళ్ల వేణుగోపాల్‌, శ్రీదేవి దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. అబ్బాయికి తల్లిదండ్రులు వేద సాయిదత్త అని పేరు పెట్టారు. అయితే చిన్నప్పుడే జ్వరం రావడంతో దేన్నీ గుర్తించలేని స్థితికి సాయిదత్త చేరుకున్నాడు. చివరికి 12 ఏళ్ల వయసులో చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు వేణుగోపాల్, శ్రీదేవి షాక్ కు లోనయ్యారు.

చివరికి కుమారుడి స్మృత్యర్థం ఓ గుడిని నిర్మించారు. అందులో తమ కుమారుడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ విషయమై బాలుడి తండ్రి మాట్లాడుతూ.. తనకు గుడి కట్టమని సాయిదత్త చెప్పినట్లు అనిపించిందని తెలిపారు. బాబు కోసం చిన్న మందిరం కడితే మూడుసార్లు కూలిపోయిందనీ, అందుకే ఈసారి అర ఎకరం విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించామని వెల్లడించారు. బాబు పేరుపై చారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News