Andhra Pradesh: లక్ష్మీస్ ఎన్టీఆర్, కథానాయకుడు సినిమాలపై సర్వే.. ఫలితాలను వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ!

  • మెజారిటీ ప్రజలు తనవైపే ఉన్నారని వ్యాఖ్య
  • చివరికి సత్యమే గెలుస్తుందని వెల్లడి
  • ఎన్టీఆర్ స్వర్గం నుంచి దీవించారని కామెంట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో సెగ పుట్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ విడుదల చేసిన ‘వెన్నుపోటు’ పాట సీఎం చంద్రబాబును కించపరిచేలా ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలు వర్మ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడంతో పాటు చాలాచోట్ల ఆయనపై కేసులు పెట్టారు. తాజాగా ఈ వివాదంపై వర్మ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో మీరు దేని కోసం ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు?’ అని తాను నిర్వహించిన సర్వేలో 50,000 మందికిపైగా పాల్గొన్నారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. వీరిలో 68 శాతం మంది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకే ఓటేశారని వెల్లడించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి కేవలం 32 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారన్నారు. ఎక్కడయినా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తమను ఆశీర్వాదించారని వర్మ ఈ రోజు ట్వీట్ చేశారు.

More Telugu News