Jagan: జగన్ పై హత్యాయత్నం కేసు.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు కీలక ఆదేశాలు!

  • కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలా? వద్దా?
  • జనవరి 4లోగా అభిప్రాయాన్ని చెప్పండి
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై ఆమధ్య విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ దాఖలుచేసిన పిటిషన్ ను ఈ రోజు విచారించిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది.

ఈ విషయాన్ని 2019, జనవరి 4వ తేదీలోగా తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో ఈ ఏడాది అక్టోబర్ 25న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జగన్ హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు.
Jagan
YSRCP
Andhra Pradesh
murder
attempt
High Court
nia
notice

More Telugu News