KCR: ఫెడరల్‌ ఫ్రంట్‌వైపు కేసీఆర్‌ వడివడిగా అడుగులు.. 23న ఒడిశా వెళ్లనున్న టీఆర్‌ఎస్‌ అధినేత

  • దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలు
  • అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రకటించిన కేసీఆర్‌
  • గతంలోనే పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటకలో పర్యటన

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో మంచి జోష్‌ మీదున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫెడరల్‌ ప్రంట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని ఎన్నికల ముందే ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడాపనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన ఒడిశాకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌కుమార్‌ పట్నాయక్‌తో భేటీ కావాలని నిర్ణయించారు.

దేశరాజకీయాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలను ఆయనతో చర్చించనున్నారు. ఫ్రంట్‌లో చేరాలని కోరనున్నారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తారు.  24వ తేదీన ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

More Telugu News