Asara: తెలంగాణలో 57 ఏళ్లకే పింఛన్ రావాలంటే... ఈ నిబంధనలకు లోబడి వుండాలి!

  • ఆసరా పింఛన్ వయసు కుదింపు
  • 65 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు
  • ఓటరు కార్డు ద్వారా వయసు నిర్ధారణ

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్ల వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తానంటూ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. వయసు నిర్ధారణకు ఓటరు కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని, మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా అమలు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 ఇక వృద్ధాప్య పెన్షన్ల నిబంధనలు పరిశీలిస్తే, 1953 నుంచి 1961 మధ్య జన్మించి, 57 ఏళ్లు దాటి ఉండాలి. మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 3 ఎకరాలు దాటరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ. 1.5 లక్షలు, నగరాల్లో రూ. 2లక్షలు దాటరాదు. పింఛన్‌ కు దరఖాస్తుచేసేవారి పిల్లలు డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తులు, వ్యాపారాలు చేస్తుండరాదు.

ఇదే సమయంలో వారికి పెద్ద వ్యాపారాలు ఉండకూడదు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ పొందుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. పెద్ద వాహనాలు ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నవారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఇక దరఖాస్తుదారుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో వీఆర్వోలు, బిల్‌ కలెక్టర్లు భాగస్వాములై ఉంటారు.

More Telugu News