Avanthi Srinivas: లేదు.. నేను పార్టీ మారడం లేదు: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టీకరణ

  • అది తప్పుడు ప్రచారం
  • ఈ ప్రచారం వెనక కుట్ర ఉంది
  • ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు

తాను టీడీపీని వీడబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పందించారు. తాను పార్టీని వీడడం లేదని, అవన్నీ పుకార్లేనని, వాటిని పట్టించుకోవద్దన్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో కుట్ర ఉందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నట్టు గత రెండుమూడు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని, టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్టు వార్తలు షికారు చేశాయి. దీంతో స్పందించిన ఆయన అటువంటిదేమీ లేదని తేల్చేశారు. నిజానికి ఆయన ఈ ఏడాది జూన్‌లోనే పార్టీని వీడబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అవి సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి అటువంటి వార్తలే హల్‌చల్ చేస్తుండడంతో మరోమారు ఖండించారు.

More Telugu News