తెలంగాణలో చివరి 'కిన్నెర' గాయని బాలమ్మ మృతి
- మూగబోయిన కిన్నెర వాయిద్యం
- కటిక దారిద్య్రాన్ని అనుభవించిన బాలమ్మ
- ఆదుకునేందుకు ముందుకు రాని ప్రభుత్వం
కిన్నెర కళను నిలబెట్టాలన్న ఆలోచన లేని ప్రభుత్వాలు ఆమెను విస్మరించాయి. ప్రభుత్వం నుంచి ఆమెకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. చివరికి సొంత ఇల్లు, ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు కూడా ఆమెకు లేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బాలమ్మ వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా మంచం పట్టారు. ఆమెను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
బాలమ్మ మృతి తెలంగాణ కళాకారులకు తీరని లోటని, తెలంగాణ ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయిందని తెలంగాణ రచయితల వేదిక సంఘం అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు, పొట్లపల్లి ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లపల్లి వరప్రసాదరావు, పాలమూరు వర్సిటీ ప్రొఫెసర్ గూడూరు మనోజ తదితరులు పేర్కొన్నారు. బాలమ్మ మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.