insult: నేను లావయ్యానా?.. ఆయన వ్యాఖ్యలు మొత్తం మహిళలకే అవమానం!: వసుంధర రాజే

  • రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో శరద్ తీవ్ర వ్యాఖ్యలు
  • లావైన వసుంధర రెస్ట్ తీసుకోవాలని సలహా
  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు 

తాను లావయ్యానంటూ లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా స్పందించారు. శరద్ వ్యాఖ్యలు తనను బాధించాయని, మొత్తం మహిళలనే ఆయన అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే బాధాకరమైన విషయం మరోటి ఉండదని అన్నారు.

తన కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వసుంధర.. ఆయన మాటలను యువత ఉదాహరణగా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. శరద్ యాదవ్ వ్యాఖ్యలతో తాను చాలా అవమానానికి గురయ్యానని, మొత్తం మహిళలను ఆయన అవమానించారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఉదయం ఝల్రాపటన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విలేకరులో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. శరద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.

రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ నెల 5న శరద్ యాదవ్ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి వసుంధర రాజే శరీరాకృతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె రోజురోజుకు లావైపోతున్నారని, ఆమె ఇక విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News