Elections: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 18 మంది ఉద్యోగులపై వేటు

  • శిక్షణ శిబిరాలకు గైర్హాజరు
  • ఎన్నికల సామగ్రి తరలింపులో నిర్లక్ష్యం
  • సస్పెండ్ చేసిన కలెక్టర్ రజత్ కుమార్ సైనీ

18 మంది ఉద్యోగులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైనీ సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించే కార్యక్రమానికి వీరు గైర్హాజరయ్యారు. ఎన్నికల విధులపై అవగాహన కల్పించేందుకు గతంలో ఏర్పాటు చేసిన రెండు శిక్షణ శిబిరాలకు వీరు డుమ్మా కొట్టారు.

వీరి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ కూడా చేస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేశారు.

More Telugu News