Buhari: నేను బతికే ఉన్నా.. డమ్మీని కాదు: బుహారి

  • గుర్తు తెలియని వ్యాధికి చికిత్స
  • బుహారి చనిపోయారని వదంతులు
  • పట్టించుకోని బుహారి దంపతులు

నైజీరియా అధ్యక్షుడు బుహారి గుర్తు తెలియని వ్యాధికి చికిత్స నిమిత్తం గత ఏడాది లండన్ వెళ్లారు. చికిత్సలో భాగంగా ఆయన ఎక్కువ కాలం లండన్‌లోనే గడిపారు. కొన్నాళ్లకు తిరిగి వచ్చారు.. కానీ ఈలోపే ఆయన చనిపోయారని ఆయన స్థానంలో బుహారిని పోలిన మరో వ్యక్తి పరిపాలన సాగిస్తున్నారంటూ పుకారు ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. పరిపాలన సాగిస్తున్న వ్యక్తి పేరు జబ్రిల్ అని, పొరుగున ఉన్న సూడాన్ నుంచి వచ్చాడంటూ వదంతులు తీవ్ర స్థాయిలో హల్‌చల్ చేశాయి.

అయితే బుహారి దంపతులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారి ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లగా అక్కడి అతిథులు ఆయనను వదంతుల విషయమై ప్రశ్నించారు. దీంతో ఆయన తాను బతికే ఉన్నానని.. డమ్మీని కానని చెప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది బుహారి అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చేయాలని భావిస్తుండటంతో ప్రత్యర్థులు ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేశారని తెలుస్తోంది. 

More Telugu News