Telangana: తెలంగాణలో కేసీఆర్ మోదీకి రబ్బర్ స్టాంప్ గా మారారు.. ఒవైసీ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నారు!: రాహుల్ గాంధీ

  • వీరంతా ఒకే తాను ముక్కలు
  • తెలంగాణ ప్రజలు తెలివైనవారు
  • వీరి కుట్రలను అర్థం చేసుకున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీకి రబ్బర్ స్టాంప్ గా మారారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ మోదీ-బీజేపీకి ‘బీ’ టీమ్ గా మారారని దుయ్యబట్టారు. ఇక ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీకి ‘సీ’ టీమ్ గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ఒవైసీ పనిచేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో రాహుల్ ఈ మేరకు స్పందించారు.

కేసీఆర్, మోదీ, ఒవైసీలు పరస్పరం దూషించుకున్నా, చివరికి కలిసిపోతారని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివైనవారనీ, మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్ కుట్రల గురించి వారికి తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Telangana
Congress
Rahul Gandhi
aimim
Asaduddin Owaisi
KCR
TRS
elections-2018
rubber stamp

More Telugu News