New Delhi: ప్రియురాలు రాలేదని గుండెలపై కోసుకుని సెల్ఫీ... అనంతరం ఆత్మహత్య!

  • న్యూఢిల్లీలో కేబుల్ ఆఫీసులో పని చేస్తున్న లక్ష్మీ నారాయణ
  • ఓ వివాహితతో ప్రేమ బంధం
  • మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తరలింపు

తన ప్రియురాలు పిలిచినా రాలేదన్న మనస్తాపంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని సంగం విహార్ సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలోని ఓ కేబుల్ ఆఫీసులో పని చేస్తున్న లక్ష్మీ నారాయణ, ఓ వివాహిత యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె లక్ష్మీ నారాయణతో సన్నిహితంగా ఉండేది. లక్ష్మీనారాయణకు కూడా వివాహమై ఇద్దరు బిడ్డలుండగా, భార్యకు దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం నాడు ఆ యువతికి ఫోన్ చేసిన లక్ష్మీ నారాయణ, ఆమెను వెంటనే తన వద్దకు రావాలని కోరాడు. ఆమె రాకపోవడంతో, మద్యం మత్తులో ఉన్న అతను తన ఛాతీపై బ్లేడుతో గాయపరచుకుని, సెల్ఫీ దిగి ఆమెకు పంపించాడు. అయినప్పటికీ, ఆమె రాకపోవడంతో కేబుల్ వైర్ల సాయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతని వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, అయితే, ఆ యువతితో జరిపిన సంభాషణ రికార్డు అతని సెల్  ఫోన్ లో లభ్యమైందని అన్నారు.

More Telugu News