Secunderabad: సికింద్రాబాద్‌లో దారుణం.. తల్లిదండ్రులకు మద్యం తాగించి పసిబాలుడి కిడ్నాప్

  • సికింద్రాబాద్‌లోని లాలాగూడ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • నమ్మకంగా ఉండి మోసం చేసిన స్నేహితుడు
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

తల్లిదండ్రులకు మద్యం తాగించి వారి ఎనిమిది నెలల బాబును కిడ్నాప్ చేసిన ఉదంతం సికింద్రాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంత్-మీరజ్ దంపతులు గత కొంతకాలంగా విద్యానగర్ రైల్వే స్టేషన్ వద్ద ఉంటున్నారు. భిక్షాటన చేసుకుని జీవించే  వీరికి ఎనిమిది నెలల బాబు ఈశ్వర్ ఉన్నాడు. ఇటీవల వీరికి గౌస్ అనే వ్యక్తి పరిచయమై వారితోనే ఉంటున్నాడు. గురువారం అందరూ కలిసి లాలాగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ రాత్రి గౌస్ మద్యం తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగి నిద్రపోయారు.

ఉదయం నిద్ర లేచిన శ్రీకాంత్ బాబు కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. అయితే, బాబుతోపాటు గౌస్ కూడా కనిపించకపోవడంతో అనుమానించాడు. తన కుమారుడిని అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని  భావించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌస్ కోసం గాలిస్తున్నారు. తుకారాం గేట్ ప్రాంతంలో గౌస్ బాబును తీసుకుని ఆటో ఎక్కి వెళ్లినట్టు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.

More Telugu News