Sonia Gandhi: సోనియా, రాహుల్ సభకు ఎస్పీజీ సెక్యూరిటీ ఆంక్షలు!

  • నేడు మేడ్చల్ లో భారీ సభ
  • పరిమిత సంఖ్యలోనే వేదికపై నేతలు
  • స్థానిక పోలీసులకు ఎస్పీజీ ఆదేశాలు!

నేడు మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి సెక్యూరిటీ ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఈ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొననుండటంతో, వారి భద్రత కోసమంటూ ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ విభాగం) నుంచి బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డికి ఆదేశాలు వెళ్లాయి. వీటి ప్రకారం, సభా వేదికపై ఎక్కువ మందిని అనుమతించరు.

వేదికపై మొత్తం 119 మంది మహాకూటమి అభ్యర్థులను, ఇతర నేతలను, స్టార్ క్యాంపెయినర్లను కూర్చోబెట్టేలా మొత్తం 220 మందికి వేదికను సిద్ధం చేయగా, 60 నుంచి 75 మందిని మాత్రమే అనుమతిస్తామని, వారి జాబితాను కూడా ముందుగానే అందించాలని ఎస్పీజీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ తనిఖీల అనంతరమే వేదికపైకి అనుమతించాలని, ప్రజల వద్దకు వీవీఐపీలు వెళ్లకుండా చూడాలని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి. పోటీలో నిలిచే అభ్యర్థుల కోసం మరో వేదికను సిద్ధం చేసుకోవాలని సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేతలకు పోలీసుల నుంచి సూచనలు వెళ్లాయి.

More Telugu News