KTR: టీఆర్ఎస్ అని చెప్పను... మీకు ఇష్టమైన వారికే ఓటేయండి: కేటీఆర్

  • ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి
  • ఎవరూ నచ్చకుంటే నోటాను ఎంచుకోండి
  • విద్యార్థినీ విద్యార్థులతో కేటీఆర్

రాష్ట్రంలోని యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని టీఆర్ఎస్ యువనేత కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం మల్లారెడ్డి కాలేజీ విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన, తాను టీఆర్ఎస్ కు మాత్రమే ఓటు వేయాలని చెప్పడం లేదని, ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి, మేలు చేస్తారని నమ్మే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా యువత గుర్తించాలని, యువత పెద్దఎత్తున ఓట్లు వేస్తే, టీఆర్ఎస్ కు మరిన్ని స్థానాలు వస్తాయని తాను నమ్ముతున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని వ్యాఖ్యానించిన ఆయన, మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఐటీ, మౌలిక, సాంకేతిక రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు యువతకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే, నోటాను ఎంచుకోవాలని కేటీఆర్ సూచించారు.

More Telugu News