janasena: ఆ మూడు స్థానాల్లో ఒక చోట పవన్ పోటీ చేస్తారట!

  • కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ
  • మీడియాకు తెలిపిన ముత్తా గోపాలకృష్ణ
  • ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపించుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్య

రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ కార్యాచరణను ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. అధకారపక్షాన్నే కాకుండా ప్రతిపక్షమైన వైసీపీపై కూడా ఆయన తూటాల్లాంటి మాటలను పేలుస్తున్నారు. మరోవైపు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నకు ఆ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాకినాడలో ముత్తా మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పోటీ చేస్తారని చెప్పారు. జిల్లాలోని కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం స్థానాల్లో ఏదైనా ఒక చోట పోటీ చేస్తారని వెల్లడించారు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా... ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ ఆశయాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 

More Telugu News