TSRTC: ఆర్టీసీ డ్రైవర్ చేతిలో సెల్ ఫోన్... నవ దంపతుల ప్రాణాలు తీసింది!

  • ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపిన టీవీ రెడ్డి
  • అదుపు తప్పి డివైడర్ ను దాటి బైక్ పైకి
  • తీవ్ర గాయాలతో భార్యాభర్తల మృతి

సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు నడిపిన ఓ డ్రైవర్, రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు 'ఏపీ 29 జడ్‌ 2157' నంబర్ గల టీఎస్ ఆర్టీసీ బస్సు వెళుతోంది. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజమండ్రికి చెందిన కోటేశ్వరరావు (29), స్వప్న (27) దంపతులు తమ వాహనంపై అదే రూట్లో వస్తున్నారు.

అయితే, సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడిపిన డ్రైవర్ టీవీ రెడ్డి, బస్సును కంట్రోల్ చేయలేక, డివైడర్ పైకి ఎక్కించగా, అది ఆ పక్కనే వెళుతున్న కోటేశ్వరరావు దంపతుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా, వారికి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్ టీవీ రెడ్డి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News