Jagan: మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విపరీతంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు: జగన్

  • అభివృద్ధి కనిపించట్లేదు
  • తాగునీరు మూడురోజులకొకసారి వస్తోంది 
  • అంగన్ వాడీ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు

పార్వతీపురంలో అభివృద్ధి కనిపించట్లేదు కానీ ఇక్కడ తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాత్రం విపరీతంగా దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు చెబుతున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్వతీపురం మునిసిపాలిటీలో తాగునీరు మూడురోజులకొకసారి వస్తోందన్నా అని ప్రజలు చెబుతున్నారు. కొద్దికాలం క్రితం అవే నీళ్లు బురదనీళ్లుగా వస్తుంటే.. మా పార్టీకి చెందిన నేతలు ధర్నాలు చేస్తే.. అప్పుడుగానీ వీళ్లకు ఫిల్టర్లు పెట్టాలని తట్టలేదు.

తోటపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా మంచినీరందించే కార్యక్రమానికి గత ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. నాలుగన్నర సంవత్సరాల కాలంలో వాటి గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. ‘పార్వతీపురంలో అభివృద్ధి కనిపించట్లేదు కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దోపిడీ మాత్రం బాగా చేస్తున్నారు’ అని ప్రజలు చెబుతున్నారు. ‘పార్వతీపురంలో బ్యూటిఫికేషన్ పనుల దగ్గర నుంచి అంగన్ వాడీ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు. సబ్ స్టేషన్లో షిప్ట్ ఆపరేటర్ల పోస్టులు, ఔట్ సోర్సింగ్ పోస్టులు కూడా వదలడం లేదు’ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు’’ అని జగన్ తెలిపారు.

More Telugu News