Andhra Pradeshch: చంద్రబాబు ప్రభుత్వానిది వృథా ప్రయాసే.. ఏపీ ప్రభుత్వం జీవో చిత్తు కాగితంతో సమానం!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • కేంద్ర సంస్థల్లో సీబీఐ దాడులు చేయొచ్చు
  • అందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
  • 15 ఏళ్ల బాబు పాలనలో ఎన్నడూ సీబీఐ విచారణ కోరలేదు

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవకతవకలపై సీబీఐ నేరుగా దాడులు నిర్వహించవచ్చని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా దాడులు నిర్వహించడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లదని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు తన 15 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా సీబీఐ విచారణ కోరలేదని ఉండవల్లి తెలిపారు. న్యాయస్థానాలు ఆదేశించినా లేదా సంబంధిత రాష్ట్రం కోరినా సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టవచ్చన్నారు. సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను తాజాగా రద్దు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన జీవో చిత్తు కాగితంతో సమానమని వ్యాఖ్యానించారు. గతంలో యూపీ సీఎం కల్యాణ్ సింగ్, బిహార్ నేత పప్పూ యాదవ్ విషయంలో ఇలాంటి నిషేధాలు ఉన్నా విచారణ కొనసాగిందనీ, అధికారులు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఐటీ దాడులతో తమను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు.

More Telugu News