jagan: జగన్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. శ్రీనివాస్ కోడికత్తితో దాడే చేయలేదట!

  • పదునైన వస్తువుతో దాడి చేశా... కోడికత్తి ఎలా వచ్చిందో తెలియదు
  • వైసీపీ 160 సీట్లు గెలుచుకుంటుంది
  • బెయిల్ పై వచ్చాక జగన్, విజయమ్మలను కలుస్తా

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. జగన్ పై కోడికత్తితో తాను అసలు దాడే చేయలేదని నిందితుడు శ్రీనివాస్ చెప్పినట్టు అతని తరపు న్యాయవాది సలీం సంచలన ప్రకటన చేశారు. కోడికత్తి ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని చెప్పాడని ఆయన తెలిపారు.

విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ తో నిన్న అతని తల్లి, సోదరుడితో పాటు సలీం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో జరిగిన సంభాషణను ఆయన మీడియాకు వివరించారు. జగన్ పై పదునైన వస్తువుతో దాడి చేశానని... కానీ, ఆ తర్వాత కోడికత్తి ఎలా వచ్చిందో తనకు తెలియదని శ్రీనివాస్ చెప్పాడని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ 160 సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని శ్రీనివాస్ వ్యక్తం చేశాడని చెప్పారు.

బెయిల్ పై విడుదలైన తర్వాత తొలుత జగన్ ను, ఆ తర్వాత ఆయన తల్లి విజయమ్మను కలుస్తానని శ్రీనివాస్ చెప్పాడని సలీం తెలిపారు. మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా శ్రీనివాస్ మాట్లాడాడని, సమాజంపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తిలా కనిపించాడని అన్నారు. 

More Telugu News