Telangana: ఫ్యామిలీని చావగొట్టి, కాళ్లు మొక్కించుకున్న ప్రబుద్ధుడు.. హారన్ మోగించాడని దారుణం!

  • హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ఘటన
  • అనుచరులతో బాధిత కుటుంబంపై దాడి
  • ఇంట్లో ఆడవాళ్లతో అసభ్య ప్రవర్తన

హైదరాబాద్ లో ఓ దుండగుడు రెచ్చిపోయారు. తన ఇంటి ముందు హారన్ మోగించినందుకు అనుచరులను వెంటపెట్టుకుని సదరు వాహనదారుడి ఇంటికి వెళ్లాడు. బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి వాళ్లందరి చేత కాళ్లు మొక్కించుకున్నాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రసాద్‌గౌడ్‌ (35)  సోమవారం అర్ధరాత్రి ఇంటికి కారులో బయలుదేరాడు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో జంక్షన్ ఉండటంతో హారన్ కొట్టి బయలుదేరాడు. దీంతో అక్కడే ఉన్న కందాడి స్కైలాబ్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. కారు నంబర్ ను గుర్తుంచుకుని 8 మంది అనుచరులతో అర్థరాత్రి ప్రసాద్ గౌడ్ ఇంటిపై దాడికి దిగాడు. ‘ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి ముందే హారన్ కొడతావ్’ అంటూ దుర్భాషలాడాడు.

ఈ దాడిని అడ్డుకోబోయిన ఇంట్లోని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి అందరితో కాళ్లు మొక్కించుకుని అవమానించాడు. ఆ తర్వాత వెళుతూ కారు అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News