Andhra Pradesh: వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను బీజేపీ గాల్లో దీపంగా మార్చేసింది!: మంత్రి లోకేశ్

  • బీజేపీ హయాంలో పీఎస్ యూలు నిర్వీర్యం
  • 74 శాతం వాటాలను అమ్మేశారు
  • ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వంపై ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా కేంద్రం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్) లో 73.44 శాతం షేర్లను విక్రయించిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తోందని లోకేశ్ ఆరోపించారు.

ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్ యూ) ను ప్రైవేటుపరం చేస్తూ వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కేంద్రం గాల్లో దీపంగా మార్చేసిందని అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా ఏపీ బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

కాగా, డీసీఐఎల్ ఉండే ఈ వాటాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పారదీప్ పోర్ట్ ట్రస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కండ్లా పోర్ట్ ట్రస్ట్‌కు అమ్మేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) గతంలోనే ఆమోదం తెలిపింది.

More Telugu News