Harish Rao: చంద్రబాబునాయుడి ముందు 18 ప్రశ్నలుంచిన హరీశ్ రావు!

  • పలు అంశాల్లో చంద్రబాబు టార్గెట్ గా ప్రశ్నలు
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు
  • ప్రాజెక్టులు, విద్యుత్ విషయంలో చంద్రబాబు కుయుక్తులు
  • బహిరంగ లేఖలో నిప్పులు చెరిగిన హరీశ్ రావు

సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ముందు 18 ప్రశ్నలను సంధిస్తూ, బహిరంగ లేఖను రాసిన ఆయన, పలు అంశాలను స్పృశించారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? ఆ ప్రాజెక్టును నిర్మించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాళేశ్వరంపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం మేము చేసిన పాపమా? కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్లను వద్దనలేదా? కల్వకుర్తిపై కుట్రలు చేశారన్నది నిజం కాదా? పోలవరానికి బదులు కృష్ణాకు నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడారా? లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దన్నది మీ కుతంత్రం కాదా? అని నిప్పులు చెరిగారు.

ఎవరి అనుమతితో ఏపీలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం ముంపు మండలాలు అన్యాయంగా తెలంగాణకు దూరం చేయలేదా? సీలేరు విద్యుత్ ప్లాంటును తీసుకోవడం ద్వారా తెలంగాణకు ఏడాదికి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లేలా చేసింది మీరు కాదా? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2,465 మెగావాట్ల విద్యుత్ ఎగ్గొట్టలేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రూ. 4,557 కోట్ల నష్టం కలిగించలేదా? ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్ టెండర్లలో పాల్గొనడం మీ దుర్మార్గపు ఆలోచన కాదా? 1,153 మంది ఆంధ్రా విద్యుత్ ఉద్యోగుల్ని ఏపీకి తీసుకెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వంపై రూ. 1000 కోట్ల భారాన్ని మోపుతోంది మీరు కాదా? హైదరాబాద్‌ లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నా, వాటిని మాకు అప్పగించక పోవడం మీ సంకుచిత బుద్ధి కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా కోరటం దురాశ కాదా? విభజన మాయని గాయం అని మీరు బాధపడలేదా? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

More Telugu News