jagan: శ్రీనివాసరావు నన్ను కలవడానికి మొదట్లో నిరాకరించాడు!: 'జగన్ పై దాడి కేసు' నిందితుడి లాయర్ సలీం

  • బెయిల్ కోసం ఒక పిటిషన్
  • మెరుగైన వైద్యం చేయించాలంటూ రెండో పిటిషన్
  • 3వ తేదీన శ్రీనివాస్ ను కలిసిన లాయర్ సలీం

వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ తరపున కోర్టులో న్యాయవాది సలీం రెండు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిలో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా, అతనికి మెరుగైన వైద్యం చేయించాలనేది రెండో పిటిషన్.  

ఈ సందర్భంగా లాయర్ సలీం మాట్లాడుతూ, ఈనెల 3వ తేదీన శ్రీనివాస్ ను కలిశానని చెప్పారు. తొలుత తనను కలవడానికి నిరాకరించాడని, రెండు గంటల తర్వాత కలిశాడని తెలిపారు. బెయిల్ ఎప్పుడు వస్తుందని అడిగాడని చెప్పారు. జైల్లో ఏమైనా సదుపాయాలు కల్పించాలా? అని తాను అడిగానని... తనకెలాంటి సదుపాయాలు అవసరం లేదని చెప్పాడని తెలిపారు.

ఈ పిటిషన్లను తాను సొంతంగానే వేస్తున్నానని... బెయిల్ పై విడుదలైన తర్వాత శ్రీనివాస్ చెప్పదలుచుకున్న విషయాలు మీడియా ద్వారా అందరికీ తెలుస్తాయని చెప్పారు. తన పిటిషన్ల వెనుక ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు.

More Telugu News