Telangana: ప్రణయ్-అమృతల ఇంటివద్ద తచ్చాడిన అపరిచిత వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు!

  • పోలీసులను చూసి నిందితుడి పరారీ
  • నిందితులపై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ ను సొంత మామ మారుతీరావు చంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు తన ప్రాణానికి సైతం ముప్పుందని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు వారి ఇంటి దగ్గర పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, తాజాగా పోలీసులు ఉన్నప్పటికీ ఓ దుండగుడు అమృత ఇంటి వద్ద తచ్చాడినట్లు తేలింది.

నిన్న సీసీటీవీ ఫుటేజీ ఫీడ్ ను పరిశీలించగా, శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అమృత ఉంటున్న ఇంటి ప్రాంగణంలో తచ్చాడినట్లు గుర్తించారు. ముసుగు ధరించి అక్కడే తిరిగిన నిందితుడు పోలీసుల పెట్రోలింగ్ వ్యాన్ చూసి పరారయ్యాడని వెల్లడించారు. ఈ విషయమై ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్‌కుమార్‌పై పోలీసులు ఇటీవల పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.

More Telugu News